శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలి?
శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని
నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ మాసంలో వచ్చే ప్రతీ
రోజుకి, ప్రతీ వారానికి ప్రత్యేకత ఉంది. ఈ నెలలో వచ్చే
సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు,
శనివారాలు ఎంతో పవిత్రమైనవి.
శ్రావణ మాసం లో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి,
పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి , దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా,
చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే
మాసం. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట
రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన
మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు.
శ్రావణ మాసం – శ్రావణ సోమవారం
ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు.
దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు
నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని
భక్తులు ప్రగాడం గా నమ్ముతారు. ముఖ్యంగా ఈ ఉత్తర భారతదేశంలో శ్రావణమాసాన్ని అత్యంత
భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఉపవాసాలు, మాంసభక్షణకు దూరంగా
ఉండటం, అభిషేకాలు ఆచరించండం, శివక్షేత్రాలు
దర్శించడం చేస్తారు.
శ్రావణ మంగళవారం
శ్రావణంలో కొత్తగా పెళ్లి అయిన వారికి ఇదొక ప్రత్యేకమాసం
అని చెప్పవచ్చు. కొత్త పెళ్లికూతురు శ్రావణమాసంలో వచ్చే ప్రతిమంగళవారం మంగళగౌరీ
వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. మంగళగౌరీ అనుగ్రహం తో
అష్టైశ్వర్యాలు, నిండు ముత్తెదుతనం పొందుతారు. శ్రీ కృష్ణుడు
ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన
మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ
స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు
వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం
ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా
చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక
సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు. ఈ వత్రం ఆచరించడం వల్ల కొత్త పెండ్లికూతురు ఆ
ఊరిలో అందరితో ప్రేమతో కలవడం, ఆప్యాయతలను పొందడం, సోదరీ, సోదర భావనలు, బంధుత్వాలు,
మిత్రుత్వాలు పెరగడం, కొత్తదనం పోవడం వంటి
అనేక లాభాలు ఈ వ్రతం వల్ల కలుగుతాయి.
శ్రావణ శుక్రవారం
ఈ మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి
వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మిదేవిని షోడషోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు,
అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని
పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త సులభురాలు. ధనం, భూమి,
విజ్ఞానం, ప్రేమ, కీర్తి,
శాంతి, సంతోషం, బలం ఈ
అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని
రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత
విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి
ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు
కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే
ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి
ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం.
శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని
ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ
సంప్రదాయాలలో ఆచరిస్తారు.
శ్రావణ శనివారాలు
ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం
సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస
ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. ముఖ్యంగా కలియుగదైవం
శ్రీవేంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం. శనివారాలలో స్వామికి పాయసం, రవ్వకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించండం, పిండి దీపాలతో స్వామిని ఆరాధించడ, ఉపవాసం ఉండటం వంటి
ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు.
శ్రావణ పౌర్ణమి
శ్రవణానక్షంత్రంలో పౌర్ణమి రావడం ఈమాసానికి శ్రావణమాసం అని
పేరువచ్చింది. ఈ మాసంలో ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని, రాఖీ
పౌర్ణమిగా, ఉపాకర్మ పౌర్ణమిగా పిలుస్తారు. ఈరోజు హయగ్రీవ
జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ
రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది
కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .
జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని
పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు
ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని,
యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన
యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.
రక్షా బంధనం
శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ, రాఖీ
పండుగ, రక్షా బంధన్ అని కూడా అంటారు. మహిళలు తమ
అన్నదమ్ములకు, సోదర సమానులకు రాఖీని కట్టి వారి క్షేమం
కోరుకుంటారు. శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో
వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి.
అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12
దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12
నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి
చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది.
నాగుల చవితి
నాగుల చవితి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధి ని
నాగదేవతలకు ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం, నాగ
దేవతలకు పాలు పోస్తే సంతానానికి సంబంధించిన దోషాలు అన్ని తొలుగుతాయి. సర్పదోషాల
నుంచి విముక్తి లభిస్తుంది.
హయగ్రీవ జయంతి
శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి అని పురాణాల్లో ఉంది. ఈ
రోజు విష్ణు ప్రీతిగా చేసే అర్చన, ఆరాధన, వ్రతాలు,
విశేష ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ రోజున హయగ్రీవుల వారి ద్వారా
ఉపదేశించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి గుగ్గిళ్లు నైవేద్యం పెట్టటం
మంచిది. మనలో ఉండే అహంకారం తొలగిపోయి అందరిలో సమ భావన కలిగి ఉంటారు.
శ్రీ సంతోషిమాతా వ్రతం
శ్రావణ పూర్ణిమ రోజుని శ్రీ సంతోషీ మాతా జయంతిగా
జరుపుకుంటారు. ఈ రోజున సంతోషిమాతా వ్రతం చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని
నమ్మకం. శ్రీ సంతోషిమాతా వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్నిశుభాలు కలుగుతాయని, ధన,
కనక, వస్తు, వాహన యోగంతో
పాటు నిండు ముతైదుతనం లభిస్తుందని మహిళలు భావిస్తారు. .